నేరుగా జైలుకెళ్లిన జగన్ కు.. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదు: రఘురామకృష్ణ రాజు

  • అశోక్ బాబు తప్పు చేసుంటే సర్వీస్ రూల్స్ చర్య తీసుకుంటుంది
  • అంతేకాని కేసును సీఐడీకి అప్పగించడం ఏమిటి?
  • అశోక్ ను అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్లారో తెలియడం లేదు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఖండించారు. అశోక్ బాబు తండ్రి చనిపోతే ఆ ఉద్యోగాన్ని ఆయనకు ఇచ్చారని చెప్పారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తితో పిటిషన్ వేయించి, ఆయనను అరెస్ట్ చేయించారని అన్నారు.

అసలు ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు. అశోక్ బాబును అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియదని అన్నారు. సీఎం జగన్ కు, సీఐడీకి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తనకు తెలుసని... కానీ నేరుగా జైలుకు వెళ్లిన జగన్ కు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదని అన్నారు.

ఒకవేళ తన సర్టిఫికెట్లకు సంబంధించి అశోక్ బాబు తప్పు చేసి ఉన్నట్టయితే సర్వీస్ రూల్స్ చర్య తీసుకుంటుందని... అంతేకానీ కేసును సీఐడీకి అప్పగించడం ఏమిటని రఘురాజు ప్రశ్నించారు. వారికి లేని హక్కులను కూడా కల్పించుకుని అశోక్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని అన్నారు.

ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారని... ఆయనకు ఎలాంటి హాని చేయవద్దని కోరారు. ఈ అరెస్టుకు సంబంధించి రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనేదే తన ఆకాంక్ష అని చెప్పారు.

Raghu Rama Krishna Raju
YSRCP
Jagan
Ashok Babu
Telugudesam

More Telugu News